కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను కోరారు. శుక్రవారం టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం ఎస్ఈసీని కలిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు.
కుప్పంలో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ దాడి చేసిందని, వైసీపీ అభ్యర్థుల నామినేషన్లని అధికారులే దగ్గరుండి వేయిస్తున్నారని, ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలంటే వైసీపీకే ఓటేయాలని అధికారులే ఒత్తిడి తెస్తున్నారన్నారు. కుప్పంలో ప్రత్యేక ఎన్నికల అధికారిగా నియమించిన లోకేష్ వర్మను తప్పించాలని ఎస్ఈసీని కోరామని వెల్లడించారు.
కుప్పంలో వైసీపీ నిర్వహించిన సభలో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడారని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ కుప్పంలో వైసీపీ సభ నిర్వహించిందన్నారు. కుప్పం స్పెషలాఫీసర్ వైసీపీ కార్యకర్తగా పని చేస్తున్నారని, ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్ఈసీ మీదే ఉందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు.