TG Venkatesh: హైదరాబాద్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్లో పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార వైసీపీ నేతలు ఇద్దరు నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రజలు చనిపోతే పరామర్శించింది లేదు.. కానీ, 11 మంది మృతికి కారణమైన చంద్రబాబును పవన్ పరామర్శించడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.. అయితే, చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత టీజీ వెంకటేష్.. ఆ ఇద్దరు నేతలు కలవడానికి వైసీపీ నేతలే కారణం అన్నారు.. రోజు దత్త పుత్రుడు అనే విమర్శలతో పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిశారన్న ఆయన.. పవన్కు ఒక్క సీటు రాదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. అదే ఒక్కసీటు రాని పవన్.. చంద్రబాబును కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని నిలదీశారు.
Read Also: Mega Bonuses: ఇది కదా గుడ్న్యూస్ అంటే.. ఉద్యోగులకు ఒకేసారి నాలుగేళ్ల బోనస్..
ఇక, ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అయినా సాధ్యమే… ఆరు నెలల ముందు మాత్రమే పొత్తులు ఖరారవుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్.. పొత్తులపై బీజేపీ అడిగితే తన అభిప్రాయాన్ని తెలియచేస్తానని తెలిపారు.. ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నప్పుడు బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు. అయితే, ఎవరితో అయినా కలసి పనిచేయాలనుకుంటే బీజేపీ నిర్ణయం వేరుగా ఉంటుందన్నారు.. వైసీపీకి ఎలాగూ ఎవరితోనూ పొత్తు ఉండే విధానం లేదని చెప్పుకొచ్చారు.. ఇక, తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు బీజేపీ నేత టీజీ వెంకటేష్. కాగా, ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో పాటు.. ఎన్నికల్లో పొత్తులపై టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.