Telugu CMs Meeting: ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కాసేపట్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతుంది. ఈ భేటీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో పాటు రెండు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. ఈ సమావేశ ఎజెండాలో గోదావరి- బనకచర్ల ప్రాజెక్ట్ అంశం పక్కన పెట్టాలని నిన్న ( జూలై 15న) జలశక్తి శాఖ కార్యదర్శికి తెలంగాణ సీఎస్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న అంశాలను చర్చించి పరిష్కరించాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో లేఖ రాశారు.
Read Also: YS Jagan: బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ ఉంటాయి.. సెన్సార్ వాళ్లకు చెప్పండి!
అయితే, నిన్న రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలో పోలవరం- బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు ప్రాంతమైన రాయలసీమకు నీరు అందించడం కోసమే పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం అని పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని ఉపయోగించుకోవడానికి బనకచర్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో పోలవరం నుంచి కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్ వరకూ 200 టీఎంసీల వరద నీటిని తరలించేలా ఈ లింక్ ప్రాజెక్టు ప్రతిపాదించినట్లు వివరించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 టీఎంసీల మిగులు నీరు ఉంటుందన్నారు. చివరి రాష్ట్రంగా గోదావరి మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఏపీకి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ జరిగే సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
