కరోనాతో మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ తరఫున ప్రకటించిన రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని డిసెంబర్, 15వ తేదీన బుధవారం రోజు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కరోనాతో మరణించిన 63 జర్నలిస్టు కుటుంబాలకు ఈ సాయం అందిస్తామని ఆయన తెలిపారు. జర్నలిస్టులను పట్టించుకుని కరోనా సమయంలో వారిని ఆదుకునేందుకు నిధులు సమకూర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
మార్చి నుండి డిసెంబర్ 6వ తేదీ వరకు 7 నెలల కాలంలో ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు చెక్కుల పంపిణీ జరుగుతుంది. కరోనా 2వ విడతలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాల నుంచి ఇప్పటి వరకు 63 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించి ఆయా కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. మార్చిలో ఆర్థిక సహాయం అందించిన వారిలో కరోనా మహమ్మారితో మరణించిన మూడు జర్నలిస్టుల కుటుంబాలకు అదనంగా మరో మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కులను అదే రోజు అందించడం జరుగుతుంది. అనారోగ్యం బారిన పడి పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు 50 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తారు. మొత్తం 101 మంది లబ్ది చేకూరుస్తూ ఒక కోటి 62 లక్షల రూపాయల పంపిణీ జరుగుతుందని అల్లం నారాయణ తెలిపారు. ఈ కుటుంబాలకు అయిదేళ్లపాటు రూ.3000/-ల చొప్పున పెన్షన్ కూడా అందిస్తామని ఆయన తెలిపారు.
కరోనా విపత్కర సమయంలో వారియర్స్ గా పని చేసిన వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులతోపాటు జర్నలిస్టులు కూడా వార్తా సేకరణలో గడ్డు పరిస్థితులలో పని చేశారు. అందువల్లనే జర్నలిస్టులు కూడా విరివిగా కరోనా బారిన పడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి తరఫున కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకుంటోంది.
ఇప్పటి వరకు మొత్తం 3909 మందిలో తొలి విడతగా 1553 మందికి 20 వేల చొప్పున, హోంక్వారంటైన్ లో ఉన్న 87 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామని అల్లం నారాయణ చెప్పారు. రెండవ విడతలో 2269 మందికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశాం. జర్నలిస్టులకు కరోనా సాయంగా మొత్తం 5 కోట్ల 56 లక్షల రూపాయలు మీడియా అకాడమి నుండి జర్నలిస్టుల ఖాతాలకు పంపిణీ చేసి ఆర్థిక సహాయం ద్వారా ఆదుకుంది. సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయ భవనంలోని 2వ అంతస్తులోని మీడియా అకాడమీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేస్తారు. కరోనాతో మరణించిన 63 మందికి, ఇతర కారణాలతో మరణించిన 34 మందికి, అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న నలుగురు జర్నలిస్టులకు డిసెంబర్, 15వ తేదీన బుధవారంనాడు హైదరాబాద్ కు వచ్చి చెక్కులు తీసుకోవాలని కోరారు. మొత్తం 101 మంది లబ్దిదారులకు ఒక కోటి 62 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేస్తామని అల్లం నారాయణ తెలిపారు.