ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ లీక్ వ్యవహారం రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ వ్యవహారం జాతీయ స్థాయి వరకు వెళ్లిన విషం తెలిసిందే.. అయితే, అది ఒరిజినల్ కాదు.. ఫేక్ అని అనంతపురం జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.. కానీ, ఇప్పుడు మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో ఫోరెన్సిక్ నివేదికను బయటపెట్టింది టీడీపీ.. అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను విడుదల చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాధవ్ వ్యవహారంతో ఏపీ ప్రజలు సిగ్గుతో తల దించుకుంటున్నారు. ఎంపీపై చర్యలు తీసుకోకుండా సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు.. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మార్ఫింగ్ అని ఎలా తేలుస్తారు..? అని నిలదీసిన ఆయన.. మేం అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించాం. ఈ నెల 9న వీడియో పంపించాం.. నిన్న నివేదిక వచ్చిందని తెలిపారు..
Read Also: Minister Gummanur Jayaram: కలియుగ రావణాసురులు చంద్రబాబు, లోకేష్..!
అమెరికాలో ఉండే జిమ్ స్టాఫర్డ్ అనే టెక్నికల్ ఎక్స్పర్ట్ కి మాధవ్ వీడియో పంపించాం.. వీడియో ఎడిటింగ్ చేసింది కాదని ఎక్లిప్స్ ల్యాబ్స్ తేల్చిందంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు పట్టాభి.. ఈ ల్యాబ్ అమెరికాలో ఫ్లోరిడాలో చాలా పేరున్న ఫోరెన్సిక్ ల్యాబ్.. ఈ నివేదిక ఆధారంగా ఎంపీపై చర్యలు తీసుకోవాలి, మాధవ్ తో రాజీనామా చేయించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. ఇక, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. మాధవ్ అనే పోరంబోకును ఎంపీ అని పిలవడానికి నోరు రావడం లేదన్నారు.. గలీజు వ్యవహారాన్ని కులానికి ఆపాదించడం సిగ్గు చేటు అని మండిపడ్డ ఆమె.. ప్రభుత్వం, పోలీసులు మాధవ్ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు తిరుపతి కొండపై మాధవ్ వ్యవహారం గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం అని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె.. ఫోరెన్సిక్ నివేదిక పై చర్చించే దమ్ము పోలీసులకు, ప్రభుత్వానికి ఉందా…? అంటూ సవాల్ చేశారు.
ఇక, ఈ రిపోర్ట్ కూడా కమ్మ వాళ్ళు ఇచ్చారని చెప్తారా…? అని ప్రశ్నించారు వంగలపూడి అనిత.. మాధవ్ నువ్వు మనిషివా..? పశువ్వా…? అంటూ ఫైర్ అయిన ఆమె.. విప్పి చూపిస్తా అని మాధవ్ ఎలా అంటారు..? పోర్న్ స్టార్ అని మాధవ్ కు అనంతపురంలో హోర్డింగ్స్ పెడుతున్నారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా మంత్రులు మార్ఫింగ్ అని ఎలా చెప్తారు..? అని నిలదీసిన ఆమె.. మేం విడుదల చేసిన ఫోరెన్సిక్ నివేదికను రాష్ట్రపతి, ప్రధాని దృష్టికి కూడా తీసుకెళ్తామని వెల్లడించారు. కాగా, ఎంపీ మాధవ్ వీడియో విషయంలో.. అనంతపురం జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ తర్వాత అంతా ముగిసినట్టే అని భావిస్తే.. ఇప్పుడు ఈ వ్యవహారం మరింత రచ్చగా మారేలా కనిపిస్తోంది. మరి అధికార పక్షం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుంది..? టీడీపీ బయటపెట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.