రెండున్నరేళ్ల పాలనలో వైఎస్ జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ కామెంట్ చేశారు టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు… శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్టేషన్ నుంచి ఎంపీ రామ్మోహన్ నాయుడు , మాజీ ఎమ్మెల్యే కూనరవికుమార్ విడుదలయ్యారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. సీఎం జగన్ ప్యాలెస్ దాటి బయటకు అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు.. తక్షణమే నిత్యావసరాల ధరలను తగ్గించాలని కోరారు.. ఇక, రెండున్నరేళ్ల పాలనలో జగన్ అభివృద్ధిలో జీరో… అవినీతిలో హీరో అంటూ వ్యాఖ్యానించిన టీడీపీ ఎంపీ.. ప్రజల నుంచి డబ్బు వసూలు చేసి… అదే డబ్బు నవరత్నాల కోసం ఖర్చు చేస్తున్నారని.. ఇదంతా పెద్ద స్కామ్… ఆర్ధిక నేరం అన్నారు.
వైఎస్ జగన్ సీఎం పదవిని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు ఎంపీ రామ్మోహన్ నాయుడు.. టీడీపీని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, సీఎం జగన్ భయపడుతున్నారన్న ఆయన..మా నిరసనలను పోలీసుల చేత అడ్డుకోవడమే అందుకు నిదర్శనం అన్నారు. మమ్మల్ని అడ్డుకునే బదులు పోలీసులు లా అండ్ ఆర్డర్ పై దృష్టిపెడితే రమ్య వంటి ఘటనలు జరగవు కదా ? అని సూచించిన ఆయన.. ఆర్ధిక ఉగ్రవాదులు ఎంతమంది వచ్చినా… టీడీపీ పోరాటం కొనసాగుతుందన్నారు.. ఇక, వైఎస్సార్ కండువా కప్పుకున్న నేతలకు కోవిడ్ నిబంధనలు వర్తించవా ? ప్రశ్నించారు. తండ్రి సమయంలో సంపాదించిన డబ్బు వైఎస్ జగన్ కు సరిపోలేదని.. అందుకే జనం నుంచి దోచుకుంటున్నారని.. ప్రజావ్యతిరేక పాలనకు అతి త్వరలోనే ముగింపు కార్డు పలుకుతాం అన్నారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.