ఏపీ సర్కారుపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శలు చేశారు. ఏపీలో సినిమా సమస్యలు తప్ప మరే సమస్యలు ప్రభుత్వానికి కనిపించడంలేదా అని పయ్యావుల కేశవ్ నిలదీశారు. ఏ సమస్య లేదు అన్న తరహాలో సినిమా టిక్కెట్ల ధరల గురించి మంత్రులు చర్చించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల జీవితాల్లో సినిమా కష్టాలకు మించిన కష్టాలు ఉన్నాయన్నారు. వాటి గురించి ప్రభుత్వం ఎందుకు చర్చించడం లేదని సూటిగా ప్రశ్నించారు.
Read Also: చట్టప్రకారమే సినిమా టిక్కెట్ ధరలు: మంత్రి పేర్ని నాని
రాష్ట్రంలో రైతు సమస్యలు, తగ్గిన ఉద్యోగుల జీతాలు, నిరుద్యోగుల సమస్యలపై మంత్రులు చర్చించరా అని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని సూటిగా నిలదీశారు. ఏపీలో మంత్రులు తిట్టడం తప్ప మాట్లాడటం మానేశారని ఎద్దేవా చేశారు. పీఏసీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్లపై చర్చ జరిగిందని.. కోవిడ్ కారణంగా సంబంధిత అధికారి సమావేశానికి రాలేకపోయారని పయ్యావుల తెలిపారు. కమిటీకి ఇవ్వాల్సిన సమాచారాన్ని కూడా ఇవ్వలేదన్నారు. అజెండాకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వకపోవడానికి పీఏసీ కమిటీ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేసిందని పయ్యావుల పేర్కొన్నారు. పీఏసీ సమావేశంలో జరిగే అంశాలను బహిరంగంగా చెప్పలేనని పయ్యావుల స్పష్టం చేశారు.