అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. గుడివాడ ఆర్ఐపై మట్టి మాఫియా ఎదురు కేసు పెట్టడంపై లేఖలో వర్ల రామయ్య అభ్యంతరం తెలిపారు. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారిపైనే కేసు పెట్టారంటే మట్టి మాఫియా ఎంత శక్తివంతంగా ఉందో తెలుస్తోందని వర్ల రామయ్య ఆరోపించారు. అక్రమ మైనింగ్కు పాల్పడి రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మాఫియాను అరెస్టు చేయకుండా బాధితుడైన ఆర్ఐపై కేసు నమోదు చేయడం దుర్మార్గ చర్య అని ఆయన మండిపడ్డారు.
బాధితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం అంటే ప్రజల్లో పోలీసులపై నమ్మకం సన్నగిల్లేట్లు చేయడమేనని డీజీపీకి రాసిన లేఖలో వర్ల రామయ్య తెలిపారు. పోలీసుల్లో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పోలీసు వ్యవస్థను నాశనం చేసేలా క్రిమినల్స్ను కాపాడుతున్నారని వర్ల రామయ్య విమర్శలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల సంఘం, గనుల శాఖ అదికారులు దీనిపై మౌనం వహించడంపై కారణాలు వారికే తెలియాలన్నారు. కాగా గుడివాడ మట్టి మాఫియా ఘటనలో బుధవారం నాడు ఆర్ఐ అరవింద్పై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.