టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటనలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. అయితే, ఈ వ్యవహారంపై డీజీపీకి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.. కుప్పం ఘటనను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరు ఆ శాఖకు తీరని మచ్చగా పేర్కొన్న ఆయన.. కుప్పంలో పోలీసులు వ్యవహరించిన తీరు అధికార పార్టీతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.. ఆర్టికల్ 19ను ఉల్లంఘిస్తూ అసమ్మతి స్వరాన్ని అణిచివేస్తోందని మండిపడ్డారు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే ఎమ్మెల్సీ భరత్ శాంతి భద్రతల సమస్య సృష్టించారనేది సుస్పష్టమని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.
Read Also: CM KCR Live : Inauguration of Integrated District Offices Complex at Rangareddy Dist
ఇక, అధికార పార్టీ నేతలను అదుపు చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని డీజీపీకి రాసిన లేఖలో రాసుకొచ్చారు వర్ల రామయ్య.. చంద్రబాబు పర్యటనకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించిన ఆయన.. చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించక ముందే అధికార పార్టీ కార్యకర్తలు క్యాంటీన్పై దాడి చేసి ధ్వంసం చేయడం బాధాకరం అన్నారు. కాగా, చంద్రబాబు కుప్పం పర్యటనలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు పర్యటనను వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నాయి. కుప్పం బంద్ కు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునివ్వడంతో… వ్యాపారులు వారి దుకాణాలను మూసేశారు. ప్రైవేటు పాఠశాలలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. ఇక, టీడీపీ ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. టీడీపీ, వైసీపీలు పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి..