ఆంధ్రప్రదేశ్ అప్పులపాలు అయ్యింది.. ప్రతీ ఫ్యామిలీపై అప్పుభారం పడుతోంది.. అన్నింటికీ వైఎస్ జగన్ సర్కార్ అప్పులు చేస్తుందంటూ విమర్శలు గుప్పిస్తూ వస్తోంది ప్రతిపక్ష టీడీపీ.. అయితే, పుట్టబోయే బిడ్డపైనా కూడా వైఎస్ జగన్ అప్పు ఉందంటూ మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు.. రెండున్నరేళ్లలో చేసిన అప్పులు రూ.3 లక్షల కోట్లుగా గణాంకాలు చెప్పిన ఆయన.. ఈ లెక్కన ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం పడుతుందన్నారు.. సీఎం జగన్ రెండున్నరేళ్లలో పాలనలో రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు.
Read Also : ఆర్బీఐ కొత్త స్కీమ్ల ప్రారంభం.. పెట్టుబడి పరిధి విస్తరిస్తుంది..
ఇక, వైఎస్ జగన్ దుబారా, అవినీతి, మితిమీరిన అప్పుల కారణంగా ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల అప్పు పడుతోందని ఆరోపించారు కళా వెంకట్రావు.. అవినీతి, దుబారా కోసం ధరల పెంపు, పన్నుల పెంపు, అప్పుల పెంపుతో ప్రజానికంపై మోయలేని భారం వేస్తున్నారన్న ఆయన.. శిశువు జన్మించినప్పటి నుంచి వారి బాగోగుల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ హయాంలో అమలు చేశామన్నారు.. మరోవైపు.. సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు తాగే టీ కి కూడా డబ్బులు లేని పరిస్థితి నెలకొందన్న టీడీపీ నేత.. చంద్రబాబు పాలనలో రూ.1500 ఉన్న ట్రాక్టర్ ఇసుక జగన్ పాలనలో రూ.5000కు చేరిందన్నారు. మద్యంలో ఏడాదికి రూ.5వేల కోట్లు, ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ముడుపులు దండుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇక, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి.. 6 సార్లు పెంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కళా వెంకట్రావు.