Bonda Uma: పోలీసుల వైఫల్యమే కందుకూరు, గుంటూరులో తొక్కిసలాటకు కారణమని.. ఆ రెండు ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు.. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను పక్కదారి మళ్లించేందుకు ప్రతిపక్షపార్టీ నేతలపై వేధింపుల తీవ్రత పెరుగుతోందని.. చంద్రబాబు సభలు, సమావేశాలకు వచ్చే జనాలను చూసి సీఎం వైఎస్ జగన్ వెన్నులో వణుకు మొదలయ్యిందన్నారు.. జగన్ ఫెయిల్యూర్ సీఎం.. చంద్రబాబు సభలకు తండోపతండాలుగా జనం వస్తున్నారంటే జగన్ పనైపోయినట్టే అని జోస్యం చెప్పారు.. రాష్ట్రంలో జీవో 1 ద్వారా అప్రకటిత ఎమర్జెన్సీ జగన్ అమలు చేస్తున్నారు.. 1981లో బ్రిటీష్ పాలనకు బూజులు దులిపి.. నేడు ప్రతిపక్షాల గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబును కుప్పంలో అడుగు పెట్టనీయకుండా అరాచక సృష్టించారు. పోలీసులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Karnataka: హంగ్ దిశగా కర్ణాటక.. ట్రాకర్ పోల్ సర్వేలో వెల్లడి
ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకోవాలో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు డిసైడ్ చేస్తారట? అని ఎద్దేవా చేశారు బోండా ఉమ.. ఆనాడే జాతిపిత గాంధీ ప్రజాస్వామ్యాన్ని, విలువలను తుంగలో తొక్కే బ్రిటిష్ చట్టాలను వ్యతిరేకించారు. జగన్ ఫెయిల్యూర్ సీఎం అని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో తాలిబన్ చట్టాలను సైతం జగన్ అమలు చేసే అవకాశం ఉందన్నారు. జగన్ అరాచకాలను అడ్డుకునేందుకు అఖిలపక్షం ఏర్పాటు చేశాం. చరిత్రలో నియంతలు మనుగడ సాగించలేరని పేర్కొన్నారు. ఇవాళ జగన్ నియంతలా వ్యవహరిస్తున్నాడు.. టీడీపీ కేంద్ర కార్యాలయం ముందు వందల మంది పోలీసులను పెట్టారు.. మా పార్టీ నేతల ఇళ్ల ముందు పోలీసులు.. ఏంటీ ఈ అరాచకం..? కుప్పంలో మాజీ సీఎం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటన చేయడం తప్పా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నీకు ఒక రోజు ఉంటుందని తెలుసుకో జగన్ అంటూ హెచ్చరించారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని అధికారులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.. జగన్ రెడ్డి చెప్పినదానికి తల ఊపితే అధికారులు ఇబ్బందులకు గురవుతారు.. అక్రమ అరెస్టులకు మేం భయపడబోమని ప్రకటించారు.