రాష్ట్ర డీజీపీకి ఇప్పటికే పలు సందర్భాల్లో లేఖలు రాస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇవాళ మరోసారి డీజీపీకి లేఖ రాసిన ఆయన.. కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళిపై దాడి చేశారంటూ ఆయన దృష్టికి తీసుకెళ్లారు.. టీడీపీ కార్యకర్త మురళీని వైసీపీ గూండాలు అక్రమంగా నిర్బంధించారు.. హత్యాయత్నానికి పాల్పడ్డారని.. శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలి శిథిలావస్థకు చేరాయని.. ప్రాథమిక హక్కుల పట్ల గౌరవం లేకపోవడంతో ఆటవిక రాజ్యం తలపిస్తోందని పేర్కొన్నారు.. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన చంద్రబాబు.. టీడీపీ సానుభూతిపరులపై పదే పదే హింసాత్మక దాడులు జరుగుతున్నప్పటికీ, దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని విమర్శించారు.. వైసీపీ నేతలు, గూండాలు ఓ వర్గం పోలీసులతో కుమ్మక్కై ప్రతిపక్ష టీడీపీ నేతల ప్రజాస్వామిక గొంతుకను నొక్కేస్తున్నారన్నారు చంద్రబాబు.
కుప్పం టీడీపీ క్రియాశీల సభ్యుడు మురళిని 20 డిసెంబర్ 2021 మధ్యాహ్నం 1.55 గంటలకు వైసీపీ నేతలు కుప్పంలో కిడ్నాప్ చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు చంద్రబాబు.. మురళిని నేరుగా రెస్కో చైర్పర్సన్ జీఎస్ సెంథిల్ కుమార్ ఇంటికి తీసుకెళ్లి తీవ్రంగా హింసించారని.. మురళికి కుడి కన్ను దగ్గర అతని ముఖం మీద గాయాలయ్యాయని.. 20 డిసెంబర్ సాయంత్రం 6.30 గంటల సమయంలో సెంథిల్ కుమార్ ఇంటి నుండి రెండు కార్లు, రెండు బైక్లలో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి, కొట్టారని పేర్కొన్నారు.. వైసీపీ నేతల బెదిరింపు కారణంగా మురళి భయపడి 23 డిసెంబర్ 2021 వరకు ఈ ఘోరమైన సంఘటనను నివేదించలేదన్న ఆయన.. భవిష్యత్తులో మురళిపై ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. మురళికి భద్రత కల్పించడానికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని.. పోలీసుల సత్వర చర్య మాత్రమే రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించబడుతుందని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.