CM Chandrababu: ‘మావిగన్ అంటే నాకే అర్థం కావడం లేదు’.. జగన్‌పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..

Chandrababu

Chandrababu

CM Chandrababu: నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘మావిగన్’ అనే పదం తనకే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించిన ఆయన, గతంలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని గందరగోళానికి గురి చేసిన వైసీపీ ఇప్పుడు కొత్త పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందని ఆరోపించారు.

‘మావిగన్’పై చంద్రబాబు సెటైర్లు

‘మూడు రాజధానులు’ అనే విధానంతో రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలని ప్రయత్నించారని చంద్రబాబు విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు తమ రాజధాని గురించి గర్వంగా చెప్పుకుంటారని, కానీ ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉన్నాయని చెప్పాల్సిన పరిస్థితి రావడంతో ప్రజలు నవ్వుకున్నారని అన్నారు. అలాంటి విధానాన్ని ప్రజలు తిరస్కరించారని, అందుకే వైసీపీని కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితం చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్ని వదిలేసి ‘మావిగన్’ అంటూ కొత్త నినాదం తీసుకురావడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని విమర్శించారు.

అమరావతిపై తమ వైఖరి స్పష్టం

అమరావతి రాజధానికి 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా సుమారు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటి ప్రాంతంలో పంటలకు నిప్పులు పెట్టడం, రైతులను ఇబ్బందులకు గురిచేయడం దుర్మార్గమని ఆరోపించారు. గతంలో జగన్ కూడా అమరావతికి మద్దతు ఇస్తానని చెప్పారని, ఇప్పుడు రాజధానిపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. అమరావతిపై దండయాత్రలు చేయడం సరికాదని అన్నారు.

వైసీపీపై ఘాటు విమర్శలు

వైసీపీని ‘గొడ్డలి పార్టీ’గా అభివర్ణించిన చంద్రబాబు, ఇకపై అదే పేరుతో పిలవాలని కార్యకర్తలకు సూచించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దాడులు జరిగాయని, తిరుమలలో తనపై బాంబు దాడి జరిగినప్పుడు శ్రీ వేంకటేశ్వర స్వామి కాపాడారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రోజుకో ఫేక్ న్యూస్ సృష్టించి అశాంతి కలిగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఇక, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్‌కు కేంద్రంగా మారిందని చంద్రబాబు ఆరోపించారు. యువత జీవితాలను నాశనం చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

మహిళలపై సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, ఆయన కుమార్తెపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం దారుణమని చంద్రబాబు అన్నారు. తన భార్యను కూడా గతంలో అసెంబ్లీ సాక్షిగా అవమానించారని గుర్తు చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నెల మొదటి తేదీన పేదల సేవ కార్యక్రమంలో పాల్గొనడం తనకు పండగలాంటిదని చంద్రబాబు చెప్పారు. కేవలం బటన్ నొక్కి డబ్బులు పంపే నాయకుడిని కాదని, ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకునే నాయకుడినని అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నామని, ఏడాదికి రూ.33 వేల కోట్ల మేర సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

వెలిగొండ, అభివృద్ధి ప్రాజెక్టులపై హామీ

నెల్లూరు జిల్లాకు అత్యంత కీలకమైన వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి సాగు, తాగునీటిని అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పూర్తి కాకముందే ప్రారంభోత్సవాలు చేసి ప్రజలను మభ్యపెట్టారని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. అలాగే కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విద్యుత్, పరిశ్రమల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. తాను, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. గత ప్రభుత్వ విధ్వంసకర పాలన వల్ల రాష్ట్రం వెనుకబడిందని, ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. అవినీతి పాలనకు ముగింపు పలికి సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..