పల్నాడు జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. రెంటచింతలలో టాటా ఎస్ వాహనం, లారీ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. . మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. రెంటచింతలకు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శించుకుని తిరిగి పయమనమయ్యారు. కాసేపట్లో ఇంటికి వెళ్లనుండగా ఇంతలోనే మృత్యువు కాటేసింది. రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగిఉన్న లారీని ఢీకొట్టింది.
ఈ ఘటనలో టాటా ఎస్ వాహనంలోని వారు రోడ్డు మీదకు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డు మొత్తం రక్తసిక్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డవారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కాగా గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెంటచింతల ప్రమాద ఘటన బాధితులను మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని.. మంత్రి అంబటితో పాటు జిల్లా కలెక్టర్కు ప్రమాద ఘటన వివరాలు తెలిపినట్లు ఆయన వివరించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం అందేలా ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదాలకు కారణమైన ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. నిర్లక్ష్యంతో అమాయకుల ప్రాణాలు పోతున్న పరిస్థితి బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.