అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమైపోయాయి.. అన్యాయంగా.. అధ్వానంగా పరిస్థితి ఉందంటూ ఏపీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన పరోక్ష వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్నే రేపుతున్నాయి.. అయితే, కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కేటీఆర్ అయినా.. ఎవరైనా.. మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలని.. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. ఇక, రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు, సుమారు 50- 60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉందన్నారు. ఏపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ది జరగలేదని.. ఉమ్మడి రాష్ట్రంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకు, మనకు అందరికీ తెలుసన్నారు సజ్జల.
Read Also: YS Jagan: రమ్య కేసులో తీర్పుపై స్పందించిన సీఎం..
అయితే, అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.. కానీ, కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచుకోలేదన్నారు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవని విమర్శించిన ఆయన.. మొన్నటి వరకు తెలంగాణ లోనూ విద్యుత్ కోతలున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు.. ఏపీలో సీఎం జగన్ పాలనలో తన మార్కును చూపిస్తున్నారని తెలిపారు. మరోవైపు, రమ్య హత్య కేసులో కోర్టు తీర్పుపై స్పందించిన సజ్జల.. దిశ చట్టం తెచ్చిన స్ఫూర్తితో యువతిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష పడిందన్నారు. దిశ చట్టంపై చేస్తున్నవన్నీ రాజకీయ విమర్శలేనని మండిపడ్డ ఆయన.. దిశ చట్టంపై విమర్శలు చేస్తోన్న వారికి తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.