రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒరిస్సాలోని భవానీపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఏడుగుర్రాళ్లపల్లి మూలమలుపు వద్ద బస్ బోల్తా కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులున్నట్టు పోలీసులు తెలిపారు,
ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, 40 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. క్షతగాత్రులను ఏడుగుర్రాళ్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన చింతూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు తిరిగిరాని లోకాలకు చేరడంతో వారి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.