ఆంధ్రప్రదేశ్లో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై వివాదం నడుస్తూనే ఉంది.. ఈ విషయంలో ఏపీ సర్కార్పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు.. వైఎస్ వర్ధంతికి, స్కూళ్లకు, బార్లకు లేని కరోనా.. వినాయక ఉత్సవాలు నిర్వహిస్తేనే వస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.. ఇక, వినాయక చవితి ఉత్సవాలకు అనుమతి ఇవ్వాలంటూ విశాఖలో మౌనదీక్ష చేపట్టారు.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశ్వ హిందూ సాదు పరిషత్ ఆధ్వర్యంలో మౌన దీక్షకు కూర్చుకున్నారు.. వినాయకుడి విగ్రహానికి నల్ల రిబ్బన్ కట్టి.. విశ్వ హిందూ సాదు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీశ్రీశ్రీ శ్రీనివాసనంద సరస్వతి దీక్షకు కూర్చునున్నారు. కేసరియా హిందూ వాహిని కూడా దీక్షలో పాల్గొంది.
ఈ సందర్భంగా శ్రీనివాసనంద సరస్వతి మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఖరిపై వినాయకుడు సైతం మౌన దీక్ష చేస్తున్నారన్నారు.. హిందువుల తొలి పండుగకు ప్రభుత్వం కరోనా పేరుతో అడ్డంకులు సృష్టిస్తోందన్న ఆయన.. పాశ్చత్య దేశాల్లో సైతం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.. కానీ, రాష్ట్రంలో క్రిస్టియన్ ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఇది ఖచ్చితంగా వివక్ష.. హిందూ ధర్మం, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.. అందరూ కలిసి వినాయక ఉత్సవాలు చేసుకోండి.. ఎవ్వరు అడ్డువచ్చినా నిర్వహించండి అని పిలుపునిచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రతి హిందువు గణేష్ ఉత్సవాలు జరపాలని.. ఎన్ని కేసులు పెట్టిన భయపడొద్దని సూచించారు శ్రీనివాసనంద సరస్వతి.