ఆంధ్రప్రదేశ్ ని కరువు రహిత రాష్ట్రంగా మార్చే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2027 జూన్ నాటికి పూర్తవుతుందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. అదే నెలలో గౌరవ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్ర జల శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ను సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం సోమవారం ఆయన కార్యాలయం లో కలసి గంటపాటు చర్చలు జరిపారు. ఆ వివరాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఢిల్లీలో మీడియాకు వివరించారు. పోలవరం సత్వర పూర్తి కి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని జలశక్తి మంత్రి పాటిల్ సీఎం బృందానికి హామీ ఇచ్చారని రామానాయుడు చెప్పారు. అందుకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఐదేళ్ల జగన్ పాలనలో పోలవరం ప్రాజెక్టు ప్రశ్నార్థకమైపోయిందని అన్నారు. ఎప్పటికి అవుతుందో చెప్పలేమని చేతులెత్తేసిన దుస్థితి నుంచి పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది పూర్తి చేస్తామని సగర్వంగా ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి రంగానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రి జల శక్తి మంత్రికి వివరించి సహకారాన్ని కోరారని మంత్రి నిమ్మల చెప్పారు. మైనర్ ఇరిగేషన్ రంగానికి సంబంధించి ప్రతిపాదనల తాలూకు నిధులు కూడా ఇవ్వాలని కోరామని తెలిపారు. కాలువల ద్వారా కాకుండా పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి ఎంపికైన విజయనగరం జిల్లాలో పనులు ముందుకు తీసుకు వెళుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారని నిమ్మల వివరించారు. నదుల అనుసంధాన ప్రక్రియ ద్వారా భారతదేశాన్ని సస్యశ్యామలం చేయాలనే నాటి ప్రధాని వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోదీ వరకు చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిపుచ్చుకుని అవిరళ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే పోలవరం- నల్లమల సాగర్ ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు. అలాగే గోదావరి-కావేరి అనుసంధానానికి కూడా కార్యాచరణ ప్రణాళిక రూపొందించబోతున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలోని సంప్రదాయ నీటి వనరులైన నదులు, జలాశయాలు, కాలువలు,చెరువులు సద్వినియోగానికి రాష్ట్ర ప్రభుత్వం సమర్ధ కృషి చేస్తుందని అన్నారు. అలాగే భూగర్భన్ని కూడా జలాశయంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బృహత్తర ప్రతిపాదనకు కేంద్ర మద్దతు ఉందని మంత్రి నిమ్మల చెప్పారు. అలాగే సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేట్ దెబ్బతిన్నప్పుడు దాన్ని తక్షణం మార్చి పెను ప్రమాదాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం నివారించగలిగిందన్నారు. ఇప్పుడు తుంగభద్ర డ్యామ్ కు 33 కొత్త గేట్లు మారుస్తున్నట్లు చెప్పారాయన.
పోలవరం స్టాప్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వివరించారు. అలాగే ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితుల పునరావాసం, పరిహారాలకు సంబంధించి నిధులను సకాలంలో సమకూరుస్తామని కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టు రెండో దశలో కీలకమైన భూసేకరణ, పునరావాసం కోసం వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరమన్నారు. ప్రతి ఏడాది గోదావరిలోని 3000 టీఎంసీలు నీరు బంగాళాఖాతంలో కలిసిపోతున్నందున ఈ వృధా జలాలను వినియోగించుకునే విధంగా ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు ఇవ్వాలని, గోదావరి వృధా జలాల వినియోగించుకోవడంలో రెండు తెలుగు రాష్ట్రాలు లబ్ధి పొందాలనేదే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశం అన్నారు. చిన్నపాటి సమస్యలు ఏమైనా తెలంగాణతో ఉంటే సానుకూల వాతావరణంలో చర్చల ద్వారా సర్దుబాటు చేసుకుంటామన్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ వంటి వాటికి కర్ణాటక ముందుకు వెళ్లకుండా సహకరించాలని కోరామని చెప్పారు.
