ఓవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో ముగినిపోయింది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకుని వైసీపీ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తోంది.. జగన్ సర్కార్లో ప్రజల కోసం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలు అందుతున్న తీరు.. వివిధ అంశాలపై నేతలు మాట్లాడుతున్నారు.. ఇదే సమయంలో.. వైఎస్ జగన్ సర్కార్ అమలు చేస్తోన్న నవరత్నాలపై నవ సందేహాలు వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. నవరత్నాల అమలపై నవ సందేహాలంటూ ట్వీట్ చేశారు పవన్ కల్యాణ్..
ఇక, పవన్ వ్యక్తం చేసిన నవ సందేహాల విషయానికి వస్తే..
* మొదటి రత్నం – రైతు భరోసా… 64 లక్షల మందికి మేలు అని చెప్పి.. 50 లక్షల మందికే భరోసా ఇవ్వడం నిజం కాదా?.. మూడేళ్లలో 3 వేలమంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొంటే కేవలం 700మందికే ఆర్థిక సాయాన్ని పరిమితం చేయలేదా?
* రెండో రత్నం – అమ్మ ఒడి : అమ్మ ఒడి 43 లక్షల మందికి మాత్రమే ఇచ్చి.. 83 లక్షల మందికి ఇచ్చామని ఎందుకు అబద్దపు ప్రచారం చేస్తున్నారు?
* మూడో రత్నం – పెన్షన్లు: పెన్షనర్ల జాబితాను కుదించి 5 లక్షల మందిని తొలగించిన మాట వాస్తవం కాదా?
* నాలుగో రత్నం – సంపూర్ణ మద్యపాన నిషేధం : మద్యం ఆదాయం 2018-19లో రూ.14 వేల కోట్లు… 2021-22లో రూ.22 వేల కోట్లు – ఇదేనా మద్య నిషేధం? ఈ ఆదాయం చూపించే రూ.8 వేల కోట్లు బాండ్లు అమ్మలేదా?
* అయిదో రత్నం – జల యజ్ఞం : పోలవరం ప్రాజెక్టును ‘యుద్ద ప్రాతిపదిక’న ఎప్పుడు పూర్తి చేస్తారో చెబుతారా?
* ఆరో రత్నం – ఆరోగ్యశ్రీ: ఆరోగ్యశ్రీ పథకం నుంచి ఆసుపత్రులు ఎందుకు పక్కకు తప్పుకొంటున్నాయి? సీఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు?
* ఏడో రత్నం – ఫీజు రీ యింబర్స్ మెంట్: రీ యింబర్స్ మెంట్ చేయకపోవడం వల్లే విద్యార్థులకు హాల్ టికెట్స్ ఆపేస్తున్న మాట నిజం కాదా? పీజీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు?
* ఎనిమిదో రత్నం – పేదలందరికీ ఇళ్ళు: చెరువుల్లో, గుట్టల్లో స్థలాలు ఇచ్చిన మాట నిజమే కదా? ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు?
* తొమ్మిదో రత్నం – ఆసరా: పొదుపు సంఘాల సంఖ్యను ఏటేటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు? అభయ హస్తం నిధులు రూ.2 వేల కోట్లు ఎటుపోయాయి? అంటూ నవ సందేహాలను వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.
— Pawan Kalyan (@PawanKalyan) July 8, 2022