జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. తాజాగా ఆయన.. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి వైసీపీ ప్రభుత్వానికి కార్యాచరణ ఉందా? అని అన్నారు. అధికారంలోకి వచ్చాక న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తోపాటు జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తా… ఏటా 6 వేల పోలీసు ఉద్యోగాలు, పాతిక వేల టీచర్ పోస్టులు ఇస్తాను అంటూ ముద్దులుపెట్టి మరీ చెప్పారు. మెగా డి.ఎస్సీ లేదు, పోలీసు ఉద్యోగాల భర్తీ లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తరవాత 10 వేల ఉద్యోగాలతో క్యాలెండర్ వేశారు… అవి ఇప్పటికీ భర్తీ కాలేదు. నిరాశనిస్పృహలతో నిరుద్యోగ యువత ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చారు. ఇప్పుడు వాటిని నెరవేర్చడం మరచిపోయారని ఆయన విమర్శించారు మాకు ఉద్యోగాలు ఏవి అని కలెక్టరేట్ల దగ్గరకు వెళ్ళి యువత అడిగితే లాఠీ ఛార్జీలు చేయించి అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేందుకు అవసరమైన యాక్షన్ ఫ్లాన్ అనేది ఈ ప్రభుత్వం దగ్గర ఉందా? అని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు మేలు చేసే విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల కోసం ముఖ్యమంత్రి ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారు… వాటిలో నిర్ణయాలు ఏమిటి? అమలు ఎంత వరకూ వచ్చిందో యువతకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మెగా డి.ఎస్సీ ప్రకటన ఎప్పుడు చేస్తారు… 6వేల పోలీసు ఉద్యోగాల భర్తీ ఎప్పుడు జరుగుతుందో తెలియచేయాలి. బిఈడీ చేసి టీచర్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నవాళ్ళు.. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధం అవుతున్నవాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందనే ఆందోళనలో ఉన్నారని ఆయన మండిపడ్డారు. యువత ఆందోళన అనేది ఈ ప్రభుత్వానికి అర్ధమవుతోందా? అర్థమైనా అర్ధం కానట్లు ఉందా అనే సందేహం కలుగుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పన అంటే తమవాళ్ళకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదు అని పాలకులు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.