కుప్పం పురపోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. కుపుం మున్సిపల్ ఎన్నికల నోటిషికేషన్ వచ్చిననాటి నుంచి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ పార్టీల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. అయితే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో దొంగ ఓట్లు వేశారని వైసీపీపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ లోక్ సభా పక్షనేత మిథున్ రెడ్డి స్పందిస్తూ..
కుప్పంలో దొంగ ఓట్లు అని టీడీపీ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇంత వరకు ఎవరూ దొంగ ఓట్లు వేశారని అధికారికంగా ఒక్క ఫిర్యాదు కూడా దాఖలు కాలేదని స్పష్టం చేశారు.
దాడులు జరిగాయి అని కూడా ఒక్క ఫిర్యాదు నమోదు కాలేదన్నారు. ఎన్నిక అంతా సక్రమంగా జరిగిందని అన్ని పార్టీల ఏజెంట్లు సంతకాలు పెట్టిన తర్వాతే బ్యాలెట్ బాక్సులు సీలు వేశారని ఆయన వెల్లడించారు. పోలింగ్ బూత్ లోపల ఎక్కడైనా గొడవ జరిగిందా..? ఒకరి తరపున వేరొకరు ఓట్లు వేస్తే అసలు ఓటర్లు బయటకు వస్తారు కదా ఎక్కడైనా వచ్చారా..? అని ప్రశ్నించారు. ‘దొంగ ఓటర్లని వీడియోలు తీశారు.. ఒక్కరి చేతిపైన అయిన ఇంక్ వేసిన దాఖలా ఎందుకు లేదు.. కుప్పం నియోజకవర్గంలోని ఇతర మండలాల నుంచి టీడీపీ నాయకులు వచ్చి భయభ్రాంతులు సృష్టించారు. వారే వీడియోలు తీసి తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆయన టీడీపీపై మండిపడ్డారు.