ఏపీ రాజధాని ఏది అంటే ప్రస్తుతం ఠక్కున చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. కానీ న్యాయపరమైన అంశాల దృష్ట్యా ఇటీవల మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలో అస్పష్టత నెలకొంది. ఇది విద్యార్థుల పాఠ్యపుస్తకాల్లోనూ ప్రతిబింబించింది. నాలుగో తరగతి ‘మన ప్రపంచం’ పాఠ్యపుస్తకంలో ముద్రించిన ఇండియా మ్యాప్ నుంచి ఏపీ రాజధాని మాయమైంది.
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి 2020-21కి గానూ ఈ కొత్త పాఠ్యపుస్తకాలను రూపొందించింది. పాఠ్యపుస్తకాల పరిమాణం తక్కువగా ఉండాలన్న ఉద్దేశంతో మూడు సెమిస్టర్లుగా విభజించి పుస్తకాలను ముద్రించారు.రెండో సెమిస్టర్ పుస్తకంలో ఇండియా మ్యాప్ను ముద్రించారు. సెమిస్టర్-2 తెలుగు మాధ్యమం పాఠ్య పుస్తకం చివరలో ఇండియా మ్యాప్ను ముద్రించారు. ఈ మ్యాప్లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, వాటి రాజధానులు, కేంద్ర పాలిత ప్రాంతాలను గుర్తించారు. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కేవలం ఏపీ అని చూపించి వదిలేశారు. అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు ఇచ్చి ఏపీ విషయంలో మాత్రం కేవలం రాష్ట్రం పేరు చెప్పి వదిలేయడంపై ఉపాధ్యాయులు, విద్యావంతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ మ్యాప్ చూపించి అన్ని రాష్ట్రాలు, రాజధానుల గురించి విద్యార్థులకు చెప్పేటప్పుడు ఏపీ రాజధాని గురించి ఏం చెప్పాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.