రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పరస్పర సహకారంతో సమాఖ్య స్ఫూర్తి కొనసాగేలా మా వంతుగా కృషి చేస్తాము అని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు అభినందనీయం, ఆదర్శప్రాయం. దేశంలో తొలిసారిగా వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో నాకెంతో నమ్మకం ఉంది. గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలు. వ్యవసాయానికి అండ, రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ, వికేంద్రీకరణ ప్రక్రియలు బాగున్నాయి. ఇంకా మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ యాప్. ఇది నిజంగా ఎంతో అభినందనీయం. మహిళలకు ఎల్లవేళలా ఎంతో తోడుగా నిలుస్తోంది. దిశా యాప్ ను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేయాలని సూచిస్తున్నాం.
ఇక కోవిడ్ వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షల డిపాజిట్ విధానాన్ని కూడా ఇతర రాష్ట్రాలను అమలు చేయాలని కోరతాం అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పెద్ద సంఖ్యలో కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో వాటిని అందజేస్తున్నారు. ఇది అభినందనీయం. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే చేపట్టారు. దీని వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంది. ఎన్నో భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా రాష్ట్రం ముందు ఉంది. ఇది కూడా ప్రశంసనీయం అని చెప్పారు.
అలాగే కోస్టల్ ఎకనామిక్ జోన్స్, ఎగుమతులు తదితర రంగాల్లో ఏపీ వృద్ధికి సహాయపడతాం. ఈ రంగంలో మౌలిక సదుపాయాలు కల్పన తదితర అంశాల్లో రాష్ట్రానికి చేయూత నిస్తాం. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడంతో.. ఆదాయం తగ్గిందన్న విషయం మాకు తెలుసు. సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాగా చేస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ విషయంలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. వ్యవసాయ రంగంలో రాష్ట్రం బాగా రాణిస్తోంది. ముఖ్యంగా నేచురల్ ఫార్మింగ్, ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిల్చింది. రెవెన్యూ లోటును పూడ్చడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి, వీటన్నింటి కోసం ప్రయత్నిస్తాం. పోలవరం ప్రాజెక్టు ఎత్తుకు సంబంధించి మరోసారి సమగ్ర అధ్యయనం చేస్తే బాగుంటుంది. తద్వారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మార్పులు వస్తాయి అని తెలిపారు.
అయితే మీకు విశాల తీర ప్రాంతం ఉంది. వాటిలో ఎకనామిక్ జోన్లు, పారిశ్రామిక జోన్ల ఏర్పాటు ముఖ్యం. పర్యాటక రంగం వల్ల కూడా ఆదాయం వస్తుంది. రాష్ట్రం అన్ని రంగాలలో అగ్రగామిగా నిలుస్తుంది. ఆ పొటెన్షియల్ ఇక్కడ ఉంది. ఈ విషయంలో నాకు ఎంతో నమ్మకం ఉంది. ఆ దిశలో మా వంతుగా పూర్తి సహాయ, సహకారాలు కూడా అందిస్తాం. అంగన్వాడీ కేంద్రాలలో పౌష్టికాహారం ఇస్తున్నారు. ఇది కూడా ప్రశంసనీయం. దీని వల్ల పిల్లల్లో పౌష్టికాహార లోపం ఉండదు. రాష్ట్రం చేసే ప్రతి పనిలో నీతి ఆయోగ్ మీకు అండగా నిలుస్తుంది ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో అగ్రగామిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను అని పేర్కొన్నారు.