Andhra Pradesh: ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, వాటిలో లోపాలు, ఇతర సమస్యలపై ప్రజలు నేరుగా సీఎం జగన్కు ఫిర్యాదు చేసే అవకాశం లభించనుంది.
Read Also: Dharmana Prasada Rao: మంత్రి పదవి కంటే ఈ ప్రాంతమే నాకు ముఖ్యం
మరోవైపు ఎస్డీజీ (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్) లక్ష్యాలపై సోమవారం నాడు సీఎం జగన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక యూనిట్గా విలేజ్, వార్డు సెక్రటేరియట్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిపై కార్యదర్శులు, విభాగాధిపతులకు ఓనర్షిప్ ఉంటుందని సీఎం జగన్ తెలిపారు. కార్యదర్శి, ప్రభుత్వ విభాగాధిపతి ప్రతి నెల గ్రామ లేదా వార్డు సచివాలయాలను సందర్శించాలని ఆయన ఆదేశించారు. ప్రగతి లక్ష్యాల సాధనపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ ఉండాలని.. ఇకపై ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెలా డేటా అప్లోడ్ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడైనా లోపం, సమస్య ఉన్నట్టు తెలిస్తే.. పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. దీని కోసం ఎస్ఓపీ తయారు చేయాలని పేర్కొన్నారు. ప్రతి ప్రభుత్వ విభాగానికీ పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలన్నారు. దీని వల్ల సచివాలయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పని తీరుపై పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. వాలంటీర్లతో ప్రగతి లక్ష్యాలపై ప్రతి గ్రామంలోనూ సర్వే చేయాలన్నారు. వాలంటీర్లతో చర్చించి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.