మరోసారి వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతలు, పోలీసులు, వాలంటీర్లు చేస్తున్న అరాచకాల నుంచి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! అంటూ సీఎం జగన్పై నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుందని ఆయన ఆరోపించారు.
తన ఇంటి ముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుండగా మీనాక్షమ్మ, ఆమె కుమార్తెలు అడ్డుపడ్డారిని, సాటి మహిళలు అని కూడా చూడకుండా మహిళా పోలీసులు తమ చున్నీలతో బంధించడం అరాచకపాలనలో మరో అమానవీయ ఘటన అంటూ నారా లోకేష్ నిప్పులు చెరిగారు. దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన? అంటూ ఆయన ధ్వజమెత్తారు.