Ambati Rambabu: నంద్యాలలో మాజీ మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అమరావతి నిర్మాణం, పెట్రోల్ కొరత, మరియు వైసీపీ నేతలపై కేసుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పుదోవ పట్టుతోందని ఆరోపించారు. సీఎం తీసుకున్న తప్పు నిర్ణయాల వల్లే రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ఏర్పడిందని ఆరోపించారు.. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరే విధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవో కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని అంబటి రాంబాబు విమర్శించారు. ఆ జీవోను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం ప్రభుత్వానికి అవమానకరమని, సీఎం దీనిపై సిగ్గుపడాలని అన్నారు. అమరావతి నిర్మాణం భారీ స్థాయిలో చేపట్టడం వల్లే సమస్యలు పెరిగాయని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: CM Chandrababu: ఏపీ ప్రజలకు NDA వల్ల మరోసారి స్వాతంత్య్రం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అమరావతి ప్రాజెక్ట్ పూర్తయ్యే అవకాశం లేదని, అది తన జన్మలోనే కాదు, సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ జన్మలో కూడా పూర్తికాదని వ్యాఖ్యానించారు అంబటి రాంబాబు… ఈ ప్రాజెక్ట్ పేరిట అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇప్పటికే రూ. 75 వేల కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ, భవిష్యత్తులో ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ఎన్నికల ముందు ప్రజలను దేవుళ్లుగా భావించే సీఎం, తరువాత కాంట్రాక్టర్లకే ప్రాధాన్యత ఇస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. మంత్రి నారా లోకేష్ డిఫాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు.
ఇక, వైసీపీ నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, పోలీసులు అధికార పార్టీ ఒత్తిడితో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తనపై ఇప్పటికే 36 కేసులు నమోదు చేశారని, మరిన్ని కేసులు పెట్టినా కోర్టుకు హాజరవుతానని తెలిపారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీహరిని అరెస్టు చేసి ఆటోలో తీసుకెళ్లడం దుర్వినియోగమని విమర్శించారు. కేసుల పేరిట వైసీపీ నేతలను మానసికంగా వేధిస్తున్నారని, విలేకరులపై కూడా దాడులు జరుగుతున్నాయని అంబటి రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎస్ అధికారులు కొందరు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఇది బాధాకరమని అన్నారు. పోలీసుల వేధింపులు ఆగకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఇదే సమయంలో, శిల్ప రవి మాట్లాడుతూ పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవని, మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదానీ డేటా సెంటర్ను గూగుల్ డేటా సెంటర్గా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో అక్రమాలు జరుగుతున్నాయని ఆయన కూడా విమర్శించారు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు..
