కాకినాడ పర్యటనలో భాగంగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో పొత్తు రాజకీయాల చర్చకు దారి తీశాయి. అధికార పార్టీ నేతలందరూ ఒక్కాసారిగా దిగొచ్చి.. చంద్రబాబుకు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము లేదని, అందుకే పొత్తులకు సిద్ధమయ్యారంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు రంగంలోకి దిగి, తన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలంటూ తాను కాకినాడలో చేసిన వ్యాఖ్యలను.. పొత్తులపై మాట్లాడినట్లు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు కూడా రంగంలోకి దిగి.. ‘పొత్తు’ విషయంపై చేస్తోన్న విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు అసలు పొత్తుల గురించి ప్రస్తావించలేదని, ఆయన వ్యాఖ్యల్ని రాంగ్ డైరెక్షన్లో వైసీపీ తీసుకెళ్ళిందని దుయ్యబట్టారు. పొత్తుల విషయంలో వైసీపీ నేతల కామెంట్లు, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానించినట్టే ఉన్నాయన్నారు. 2004లో పొత్తులు పెట్టుకునే వైఎస్సార్ సీఎం అయ్యారనే విషయాన్ని వైసీపీ నేతలు మరిచారా? అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే తల్లిని, చెల్లిని దూరం పెట్టిన జగన్.. పొత్తుల విషయంలో తన తండ్రి వైఎస్ను అవమానించేలా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
1994లో కాంగ్రెస్ పార్టీని అతి తక్కువ స్థానాలకు పరిమితం చేసిన సందర్భంలోనూ టీడీపీ పొత్తులు పెట్టుకుందని నక్కా ఆనంద్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తామేమీ పొత్తుల కోసం వెంపర్లాడడం లేదని, చంద్రబాబు వ్యాఖ్యల్ని వక్రీకరించి వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతోందని ఆరోపించారు. ఇక సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై తాను కామెంట్ చేయదల్చుకోలేనని అన్నారు. కాగా.. జనసేనతో పొత్తు ఉందని స్పష్టం చేసిన వీర్రాజు, టీడీపీతోనూ జనసేన చేతులు కలుపుతోందా? అనే విషయంపై పవనే క్లారిటీ ఇవ్వాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే!