ఏపీ సీఎం వైఎస్ జగన్పై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నారా..? వడ్డీ వ్యాపారం చేస్తున్నారా..? అని ఫైర్ అయిన ఆయన.. రైతుల నుంచి నీటి తీరువాను వడ్డీ విధించి వసూలు చేస్తున్నారు.. అసలే, గిట్టుబాటు ధరలు రాక.. పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితుల్లో రైతుల నుంచి వడ్డీలు వసూలు చేస్తారా? 2018 నుంచి నీటి తీరువా లెక్కగట్టి 6 శాతం వడ్డీతో రైతుల నుంచి వసూలు చేయడం దారణమైన విషయం అన్నారు. అసలు-వడ్డీ కట్టకపోతే రైతు భరోసా ఇవ్వం, భవిష్యత్తులో పంట నష్ట పరిహారానికి అనర్హులను చేస్తామని బెదిరించడాన్ని పరిపాలన అనాలా..? అంటూ నిలదీశారు.
Read Also: Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
గత నెలలో ఆస్తి పన్ను కట్టకపోతే ఇళ్లకు తాళాలు వేశారు.. ఇంట్లో సామాను తీసుకుపోతామని బ్యానర్లు కట్టి ట్రాక్టర్లు తిప్పారు.. ఇప్పుడు రైతుల మీద పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు నాదెండ్ల.. నీటి పన్ను పేరుతో వేధింపులకు దిగుతున్నారు.. గ్రామాలవారీగా నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టి మరీ వసూలు చేస్తున్నారు.. ప్రకాశం జిల్లా అన్నసముద్రం అనే చిన్న గ్రామానికి రూ.29 లక్షల నీటి పన్ను వసూలు టార్గెట్ పెట్టారంటే.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకొంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ధాన్యం సేకరణ డబ్బులను మూడు రోజుల్లో వేస్తామని ఊరూరా చెప్పిన సీబీఐ దత్తపుత్రుడు.. వారాలు, నెలలు గడిచినా డబ్బులు చెల్లించడం లేదన్నారు. నీటి తీరువాకు వడ్డీ విధిస్తున్న ఈ పాలకులు- రైతులకు ఇవ్వాల్సిన మొత్తానికీ వడ్డీ లెక్కగట్టి చెల్లించాలని.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రావాల్సిన రూ.7 లక్షల పరిహారాన్ని కూడా 6 శాతం వడ్డీతో చెల్లించాలని డిమాండ్ చేశారు.. వీరిని ఆదుకొనే ఉద్దేశం లేని ఈ ప్రభుత్వం వసూళ్లు మాత్రం వడ్డీతో సహా చేస్తోందని.. వడ్డీ వ్యాపారం విడిచిపెట్టి పరిపాలన చేయాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు నాదెండ్ల మనోహర్.