అమరావతిలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన క్రియాశీలక సభ్యులకు అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. జూలై 2న వీర మహిళలకు అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు పార్టీ సిద్ధాంతాలను గ్రామగ్రామాన వివరించేందుకు పార్టీ క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన, పునశ్చరణ తరగతులను నిర్వహించబోతున్నట్లు వివరించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత, వీర మహిళలు చేసిన కృషి అనిర్వచనీయమని నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఏపీలో జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 3.50 లక్షల మంది క్రీయాశీలక సభ్యులను చేర్చేందుకు జనసైనికులు, వీరమహిళలు చేసిన కృషి అద్భుతమని కొనియాడారు.
Read Also: Janasena Party: ‘జనవాణి’ పేరుతో కొత్త కార్యక్రమం.. ప్రజల విజ్ఞప్తులు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్
కాగా ఏపీలో జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న దానిపై క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఎలా పని చేయాలో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే ఆరు నెలల్లో ఓ గొప్ప యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా, నియోజకవర్గంలో ఉండే క్రియాశీలక సభ్యులకు ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు వరుసగా ఉంటాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.