Buggana Rajendranath: ఏపీలో వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో వివిధ బ్యాంకులు అందిస్తున్న తోడ్పాటు అభినందనీయమని ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ పేర్కొన్నారు. అమరావతి సచివాలయంలోని ఐదో బ్లాకు కలెక్టర్ల సమావేశ మందిరంలో మంగళవారం రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ (SLBC) 220వ సమావేశం మంత్రి బుగ్గన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా 2022-23 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక(ఏసీపీ)అమలులో వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి, వివిధ ఇండికేటర్ల వారీ సాధించిన లక్ష్యాలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో బ్యాంకింగ్ సెక్టార్ కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని.. కావున రైతులకు వ్యవసాయ పంట రుణాలు, ముఖ్యంగా కౌలు రైతులకు రుణాలు అందించుటలో బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ణప్తి చేశారు. అలాగే ఎంఎస్ఎంఈ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని.. ఆ రంగంలో కూడా బ్యాంకులు తమవంతు తోడ్పాటును అందించి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ముందుకు రావాలని కోరారు. టిడ్కో గృహాలు, ఇతర గృహనిర్మాణ పధకాల లబ్ధిదారులకు బ్యాంకులు సకాలంలో రుణాలు మంజూరు చేయాలని మంత్రి రాజేంద్రనాధ్ విజ్ణప్తి చేశారు. స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరులో బ్యాంకులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పారు.
Read Also: Nandamuri Balakrishna: బ్రేకింగ్ న్యూస్.. బాలకృష్ణకు రెండో ఫ్యామిలీ.. చంద్రబాబు ముందే బట్టబయలు
దేశ ఆక్వారంగ ఉత్పత్తుల ఎగుమతుల్లో 40 నుండి 50 శాతం వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండే జరుగుతున్నాయని.. ఈ రంగంలో తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు అన్ని విధాలా కృషి చేయాలని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బ్యాంకరులకు విజ్ణప్తి చేశారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి రాష్ట్రంలోని ప్రతి నియోజక వర్గానికి ఒక నైపుణ్య హబ్ ను ఏర్పాటు చేస్తోందని నైపుణ్యాభివృద్ధిని ఇంటిగ్రేట్ చేసేందుకు వీలుగా బ్యాంకులు తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలని మంత్రి విజ్ణప్తి చేశారు.అదే విధంగా ఉన్నత విద్యను అభిసించే విద్యార్ధులు బ్యాంకులతో ఇంటర్న్షిప్ చేసేందుకు వీలుగా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి సబ్ కమిటీ ముందుకు రావాలన్నారు. అంతకు ముందు వివిధ పారా మీటర్ల మిషయంలో బ్యాంకులు సిడి రేషియో, అడ్వాన్సులు, డిపాజిట్లు వంటి అంశాల్లో బ్యాంకులు మంచి ఫలితాలు సాధించాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అభినందించారు.
ఈ సమావేశంలో యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్, కంట్రీ హెడ్ ఫర్ అగ్రికల్చర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పధకాలకు బ్యాంకులు తగిన సహకారాన్ని అందిస్తు న్నాయని పేర్కొన్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళిక మొత్తం 3లక్షల 19వేల 480 కోట్ల రూ.లు రుణాలు అందించాల్సి ఉండగా జూన్ 30 వరకూ లక్షా 39వేల 798 కోట్ల రూపాయలు సహాయం అందించి 43.76 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. రంగాల వారీగా చూస్తే ప్రాధాన్యతా రంగం కింద రూ.2లక్షల 35వేల 680 కోట్లు అందించాల్సి ఉండగా 74వేల 177 కోట్లు అందించి 31.47శాతం లక్ష్యాన్ని సాధించాయని వివరించారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి లక్షా 64వేల 740 కోట్లు రూ.లు అందించాల్సి ఉండగా 53వేల 732 కోట్లు అందించి 32.62శాతం లక్ష్యాన్ని, ఎంఎస్ఎంఈ కింద 50 వేల 100 కోట్లు అందించాల్సి ఉండగా 17 వేల 847 కోట్లు అందించి 35.62 శాతం లక్ష్యాన్ని సాధించారని పేర్కొన్నారు. అదే విధంగా ప్రాధాన్యేతర రంగానికి సంబంధించి రూ.83వేల 800 కోట్లు అందించాల్సి ఉండగా జూన్ 30 నాటికి 65 వేల 622 కోట్లు సహాయం అందించి 78.31 శాతం లక్ష్యాన్ని అధికమించినట్టు శ్రీనివాసరావు చెప్పారు.
Read Also: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు ఆలయం మూత..
అటు రాష్ట్ర ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్.రావత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేస్తున్న కృషిలో బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందిస్తు న్నాయని అభినందించారు. కౌలు రైతులకు మరిన్ని రుణాలు అందించాలని, ఎంఎస్ఎంఈ రంగంలో తగిన సహకారం అందించాలని విజ్ణప్తి చేశారు. అలాగే గృహ నిర్మాణం,విద్యా రంగాలతో పాటు స్వయం సహాయక సంఘాలకు మరిన్ని రుణాలందించాలని చెప్పారు. అదే విధంగా వివిధ ప్రాధాన్యతా రంగాలకు బ్యాంకులు మరింత తోడ్పాటును అందించాలని ఆయన కోరారు.
మరోవైపు ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్ ఎస్ఎల్బీసీ సమావేశపు అజెండా అంశాలపై మాట్లాడుతూ.. జూన్ 30 వరకూ వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతిని వివరించారు. అలాగే వివిధ ఆన్ గోయింగ్ ప్రచార కార్యక్రమాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు గురుంచి మాట్లాడారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ఇంఛార్జి అనిల్ మిశ్రా మాట్లాడుతూ.. కిసాన్ క్రెడిట్ కార్డు దారులకు మరింత తోడ్పాటును అందించాలని సూచించారు. నాబార్డు జనరల్ మేనేజర్ ఎన్.ఎస్.మూర్తి మాట్లాడుతూ గత ఏడాది నాబార్డు ద్వారా రాష్ట్రంలో 26వేల కోట్ల రూ.లు సహాయం అందించగా ఈ ఏడాది రూ.37వేల 500 కోట్ల సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే 14వేల కోట్ల రూ.లు అందించినట్టు చెప్పారు. జిల్లాల పునర్వవస్థీకరణతో పొటెన్సియల్ లింక్డ్ ప్లాన్(పీఎల్పీ) ఒక సవాలు కానుందని పేర్కొన్నారు. ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక అమలులో వివిధ బ్యాంకులు మెరుగైన ఫలితాలను సాధించాయని చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయ టర్మ్ రుణాలలో మంచి లక్ష్యాలు సాధించాయని పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తి దారుల సంఘాల (ఎఫ్పీవో)కు మరిన్ని రుణాలు అందించాలని సూచించారు.వ్యవసాయ సాంకేతికతలో భాగంగా డ్రోన్ల వినియోగానికి తగిన తోడ్పాటును అందించేందుకు బ్యాంకులు అన్నివిధాలా ముందుకు రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశానికి తొలుత యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎజియం రాజబాబు స్వాగతం పలికి 220వ రాష్ట్ర స్థాయి బ్యాంకరుల కమిటీ సమావేశపు అజెండా అంశాలను చర్చకు పెట్టారు. ఈ సమావేశంలో ప్రధానంగా గత ఎస్ఎల్బీసీ సమావేశపు మినిట్స్ ఆమోదించడంతో పాటు జూన్ 30 వరకూ వివిధ బ్యాంకింగ్ కీ ఇండికేటర్లలో సాధించిన ప్రగతిని సమీక్షించారు. అలాగే వార్షిక రుణ ప్రణాళిక అమలుకు సంబంధించి జూన్ 30 వరకు వివిధ బ్యాంకులు సాధించిన ప్రగతి, అగ్రికల్చర్ రంగంలో క్రెడిట్ ఫ్లో, ఎంఎస్ఎంఈ రంగంలో డిస్పర్సుమెంట్లు, ప్రాధాన్య ఇతర రంగంలో క్రెడిట్ ఫ్లో, ఎన్పీఏలు, ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలకు రుణ సౌకర్యం తదితర అజెండా అంశాలపై సమావేశంలో చర్చించారు.