MLA Bala Nagi Reddy: మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. వాలంటీర్ వ్యవస్థ కారణంగా తాము ప్రజలకు దూరమయ్యామని, ఈ వ్యవస్థను నమ్ముకొని తాము మోసపోయామని ఆయన బహిరంగంగా వ్యాఖ్యానించారు. వాలంటీర్ వ్యవస్థ తమ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీసిందని, “వాలంటీర్ వ్యవస్థ మా కొంప ముంచింది” అంటూ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఆధారపడటంతో ప్రజలకు న్యాయం చేయలేకపోయామని కూడా ఆయన అంగీకరించారు.
Read Also: Bheems Ceciroleo: సౌండ్ ఆఫ్ ఫెస్టివల్.. సంక్రాంతి సినిమాలకు ప్రాణం పోస్తున్న భీమ్స్ సిసిరోలియో!
“వాలంటీర్ వ్యవస్థను నమ్ముకొని మేము ప్రజలకు న్యాయం చేయలేకపోయాం. ప్రజలు–నాయకుల మధ్య దూరం పెరిగింది” అని బాల నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్పై కూడా ఎమ్మెల్యే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “ఇప్పుడు కూడా జగన్కు కార్యకర్తల దగ్గర ఫోటోలు దిగేందుకు సమయం దొరకడం లేదు” అని అన్నారు. ఈసారి అయినా కార్యకర్తలను నిరాశపరచకుండా సమయం కేటాయించి ఫోటోలు దిగాలని కోరారు. అలాగే, రానున్న ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ‘2.0 వ్యవస్థ’ను అమలు చేసి, తమను ఇబ్బందులు పెట్టిన అధికారులపై చర్యలు తీసుకుంటామని బాల నాగిరెడ్డి హెచ్చరించారు. జగన్ ఆ వ్యవస్థను అమలు చేయకపోతే, తన నియోజకవర్గంలో తానే 2.0 వ్యవస్థను అమలు చేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ వ్యాఖ్యలు వైసీపీ అంతర్గత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థపై అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఈ స్థాయిలో విమర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.