Karumuri Nageswara Rao Fires on Chandrababu Naidu: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ప్రజల హృదయాలకు దగ్గర కావడం చూసి చంద్రబాబుకి పిచ్చి ముదిరిందని, ఎవరైనా ఆయన్ను మెంటల్ ఆస్పత్రిలో చూపించాలని అన్నారు. కర్నూలులో న్యాయరాజధాని వస్తే తమప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఆనందంలో అక్కడి ప్రజలు ఉన్నారని.. అందుకే వాళ్లు చంద్రబాబుని అడ్డుకొని ‘గోబ్యాక్’ నినాదాలు చేశారని పేర్కొన్నారు. ఈమధ్య చంద్రబాబు కొత్తగా తొడగొట్టడం కూడా మొదలుపెట్టారన్న ఆయన.. ఈ వయసులో అలాంటివి అవసరమా? అని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా సీఎం జగన్ పథకాలు అందిస్తూ ప్రజలకు చాలా దగ్గరయ్యారని.. అది చూసి చంద్రబాబుకి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయాయని తెలిపారు. అమరావతి రాజధాని కాకపోతే.. లక్షల కోట్ల రూపాయలు పోతాయనే బెంగ చంద్రబాబుకి పట్టుకుందన్నారు.
ఇక చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా తన భార్యను అవమానించారంటూ సింపతీ కోసం చూస్తున్నారని.. దమ్ముంటే అసెంబ్లీ రికార్డులు వెరిఫై చేసి నిరూపించమని నాగేశ్వరరావు సవాల్ విసిరారు. చంద్రబాబు భార్యను తాము ఏదైనా ఒక్క మాట చెప్పామని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. మహానుభావుడైన సీనియర్ ఎన్టీఆర్ని క్షోభ పెట్టి, ఆయన బ్యాంక్ అకౌంట్లను సైతం చంద్రబాబు బ్లాక్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు.. బీసీ న్యాయమూర్తులకు పదవులు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీఠ వేసిందని.. సీఎం జగన్ హయాంలో ఎంతోమంది బీసీలు రాజ్యసభకు వెళ్లారని అన్నారు. మంత్రి వర్గంలోని 25 మందిలో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మంత్రులుగా ఉన్నారని.. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా బీసీలకు ప్రాధాన్యత ఉందా? అని నిలదీశారు. ఇక వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు వెఎస్ కృషి చేయడం వల్లే.. హెల్త్ యూనివర్సిటీకి వైఎస్ పేరు పెట్టామని స్పష్టం చేశారు.