జగనన్న తోడు నిధులు ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి జమ చేయనున్నారు.
తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.చిరు వ్యాపారులకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు జగన్ సర్కార్ జగనన్న తోడు కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే 2020 నవంబర్ నుండి 2021 సెప్టెంబర్ వరకు రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన లబ్దిదారులకు ఈ ప్రయోజనం అందనుంది. ఈ పథకం వల్ల 4,50,546 మంది చిరు వ్యాపారస్తులు ప్రయోజనం పొందనున్నారు.లబ్దిదారుల ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీని సీఎం జగన్ నేడు జమ చేయనున్నారు.
సంవత్సర రుణ కాల పరిమితి ముగియని లబ్దిదారులు వారి రుణాలను సకాలంలో చెల్లించడం పూర్తి కాగానే, వారు చెల్లించిన వడ్డీని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని తెలిపారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి ఏటా రూ.10 వేల చొప్పున, ఇప్పటివరకు మొత్తం 9,05,458 మందికి రూ. 905 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం అందించింది. నిరుపేదలైన చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10,000 వడ్డీలేని రుణం అందిస్తామన్నారు. రుణం తీర్చిన తర్వాత లబ్దిదారులు మళ్ళీ బ్యాంకుల నుండి రూ. 10,000 వడ్డీ లేని రుణం పొందే అవకాశం ప్రభుత్వం కల్పించింది.