ఆర్థిక ఉగ్రవాది పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోంది. అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్ల పాలు కానుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆఖరికి గవర్నరును కూడా ఈ ప్రభుత్వం తమస్వార్థానికి బలి చేసింది. గవర్నర్ అధికారులను పిలిచి, తన పేరు ఎందుకు వాడుకున్నారని మందలించే వరకు పరిస్థితి వచ్చింది. గవర్నర్ రిటైరయ్యి, రేపు తన సొంత రాష్ట్రానికి వెళ్లినా కూడా, ప్రభుత్వం చేసిన తప్పులు ఆయన్ని వదలవు అన్నారు. కాంట్రాక్టర్లకు బకాయిలు, ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వముంది. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా అని.. వారికేదో ధర్మం చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. కరోనా సమయంలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం, వేలకోట్లను వ్యసనపరుల నుంచి కొల్లగొట్టింది అని తెలిపారు. పెట్రోల్ డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచిన ప్రభుత్వం వాటిపై ప్రజల నుంచి వేలకోట్లు దండుకుంటోంది. రూ. 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా సకాలంలో ప్రభుత్వం ఎందుకు జీతాలివ్వడంలేదు అని ప్రశ్నించారు.