విశాఖపట్నం…. చీకటి వ్యాపారాలకు రాచమార్గంగా మారింది. ఇతర దేశాలు,రాష్ట్రాల నుంచి యథేచ్ఛగా.. నిషేధిత సరుకుల సరఫరా జరిగిపోతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ముఠాలు చాకచక్యంగా వ్యవహరించి కోట్లకు పడగలెత్తుతున్నాయి. బలహీనతను చంపుకోలేని జనం మాత్రం బలైపోతున్నారు.ఇటీవల విశాఖ రైల్వే స్టేషన్లో భారీ ఫేక్ సిగరెట్ డంప్ బయటపడింది. కల్తీ సిగరెట్లు బ్రాండెడ్కు దగ్గరగా ఉంటూ ధూమపాన ప్రియులను తక్కువ ధరలతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
గతంలో ఐటీసీ గుర్తింపు పొందిన కంపెనీల సిగరెట్స్ మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉండేవి. ఐటీసీ నుంచి నాణ్యమైన పొగాకుని కొనుగోలు చేసి బ్రాండెడ్ కంపెనీలు సిగరెట్స్ని తయారు చేస్తుంటాయి. ఐతే, కేంద్రం విధించిన పన్ను భారంతో బ్రాండెడ్ సిగరెట్స్ ఖరీదు బాగా పెరిగింది. దీంతో నకిలీ సిగరెట్లు పుట్టుకొచ్చాయి. ఈ సిగరెట్లు మోస్ట్ డేంజరస్ అంటున్నారు వైద్యులు.నాసిరకం పొగాకుతో, రంపపు పొట్టుని కలిపేసి.. సిగరేట్లను తయారు చేసి మార్కెట్లోని బ్రాండెడ్ సిగరెట్స్ ప్యాకెట్స్ మాదిరిగా సిద్ధం చేసేస్తున్నారు. బ్రాండెడ్ సిగరెట్లు తాగితేనే క్యాన్సర్, గుండెజబ్బులు సహా రకరకాల రోగాలొస్తాయి. అలాంటిది నకిలీ సిగరెట్లు తాగడం వల్ల.. పరిస్థితి మరింత ఘోరంగా ఉండొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్స్ తయారైన ఆరు నెలల్లోపే వినియోగించాలనీ… ఆ తర్వాత అందులో ఫంగస్ చేరి.. మనిషి ఆయువుని తీసేస్తుందని.. సూచిస్తున్నారు