Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకాతిరుమల మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్న ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొయ్యలగూడెం మండలం రాజవరం చేరుకున్నారు. పొంగుటూరు లక్కవరం మధ్య నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు డిప్యూటీ సీఎంకు వినతి పత్రాలు అందించారు. అనంతరం ద్వారకాతిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకొని సుందరగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్కు అధికారులు, ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ కల్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు.
Read Also: Mangalagiri: జీడీపీసీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు ముందు కురగల్లు సొసైటీ బాధితుల ఆందోళన
ఐఎస్ జగన్నాథపురం గ్రామం నుంచి సుందరగిరి కొండపైకి వెళ్లే రహదారితో పాటు, ఆలయ ప్రదక్షిణ మండప పనులకు పవన్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నూతనంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ పనులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. ఇక, పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అయినా పవన్ కల్యాణ్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల పెద్ద ఎత్తున ప్రాంతానికి తరలి వచ్చారు. గత ఏడాది డిసెంబర్లో ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో మారు స్వామి వారి దర్శనానికి రావడం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు గ్రామంలో పలు అభివృద్ధి పనులను చేపట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.