Tirumala: తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్రోడ్డులోని మోకాళ్ల పర్వతం వద్ద వారి వ్యక్తిగత డ్రోన్తో చిత్రీకరించారు. ఈ క్రమంలో కొందరు ప్రయాణికులు వారిని సెల్ఫోన్లలో చిత్రీకరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
Read Also: Union Minister Kishan Reddy: మూడు రైళ్లను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భద్రతా కారణాల నేపథ్యంలో తిరుమలలో ఎటువంటి డ్రోన్లను ఉపయోగించేందుకు అనుమతి లేదు. కొండపైకి వచ్చే వాహనాలను అలిపిరి చెక్పోస్ట్ వద్ద చెక్ చేసిన తర్వాతే తిరుమలకు అనుమతిస్తారు. కానీ అధికారుల కళ్లు కప్పి ఇద్దరు డ్రోన్ కెమెరాను తీసుకురావడం, దానితో వీడియోలు తీయడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు ఆర్మీ కమాండర్, అతని భార్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. డ్రోన్ కెమెరా స్వాధీనం చేసుకుని అధికారులు విచారణ చేపట్టారు.