సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ రాజకీయాల గురించి తప్ప మిగతా విషయాల గురించి అంతగా మాట్లాడరు. కానీ సినిమా తారల గురించి ప్రస్తావిస్తూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ స్వతంత్ర ఉద్యమాన్ని అవమానిస్తూ కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి 1947లో వచ్చింది స్వాతంత్రం కాదు అని భిక్ష అని కంగనా పేర్కొనడంపై తీవ్రంగా స్పందించారు.
కంగనా ఒక విలాసవంతమైన యాచకురాలు అంటూ నారాయణ మండిపడ్డారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసునని పేర్కొన్నారు. దేశ స్వతంత ఉద్యమంపై మాట్లాడే అర్హత ఆమెకు లేదని…ఆమెకే కాకుండా ఆమెకు పద్మశ్రీ ఇచ్చిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు కూడా లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది అని చెప్పడం ఆమె బానిస మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తక్షణమే దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.