CM Jagan: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా ఐదో విడత రైతు భరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు రైతు భరోసా కింద 34, 288 కోట్ల రూపాయలను చెల్లించామని ఆయన తెలిపారు. మొత్తం 53. 58 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఎగొట్టిన బకాయిలను తామే చెల్లించామన్నారు. ఎన్నికల సమయంలో పెట్టుబడి సాయం కింద 12,500 రూపాయలు ఇస్తామని చెప్పాం.. కానీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడి సాయాన్ని పెంచి ఇచ్చామని తెలిపారు. రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
Read Also: Baba Ramdev : ఆగ్రహించిన సుప్రీంకోర్టు.. రూ.2300కోట్లు పోగొట్టుకున్న బాబా రామ్ దేవ్
అలాగే, రైతుల తరపున పంటల బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తోంది అని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ భారతదేశంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్నారు. ఆక్వా రైతులకు రూపాయిన్నరకే కరెంట్ ఇస్తున్నామనే విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. అలాగే, గతంలో చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తామంటే నమ్మి ఓటేశారు.. కానీ, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ సంగతి మరిచిపోయారు.. చంద్రబాబు చివరికి సున్నా వడ్డీ పథకాన్ని సైతం ఎగ్గొట్టారు ఆరోపించారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను మన ప్రభుత్వం వచ్చాక చెల్లించామని సీఎం జగన్ పేర్కొన్నారు.