ధాన్యం, ఇతర పంటల కొనుగోళ్లపై ఇవాళ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సహా పంటల కొనుగోళ్లపై ఆహార పౌరసరఫరాల శాఖ, వ్యవసాయశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్.జగన్ మాట్లాడుతూ.. పంటల కొనుగోళ్లలో ఆర్బీకేలు క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. కచ్చితంగా రైతుకు కనీస ఎంఎస్పీ ధర లభించాలని… రైతులందరికీ ఎంఎస్పీ రావడం అన్నది మన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ లక్ష్యం దిశగా ఆర్బీకేలు, అధికారులు కృషి చేయాలని తెలిపారు.
రైతులకు సేవలందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని.. ఎక్కడా కూడా సమాచార లోపం ఉండకూడదని చెప్పారు. తరచుగా రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలని.. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి గతంలో ఎవ్వరూ ముందుకు వచ్చిన సందర్భాలు లేవని వెల్లడించారు.రైతులకు తోడుగా నిలవడానికి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని.. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్ల పాత్ర ఉండకూడదని స్పష్టం చేశారు. కొనుగోలు తర్వాతే మిల్లర్ల పాత్ర ఉండాలని… ధాన్యం నాణ్యతా పరిశీలనలో రైతులు మోసాలకు గురికాకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇతర దేశాలకు నేరుగా ప్రభుత్వం నుంచే ఎగుమతులు చేసేలా చూడాలన్నారు.