Gadapa Gadapaku Work Shop: గడప గడపకు మన ప్రభుత్వంపై అమరావతి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ జరుగుతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల పని తీరుపై సీఎం జగన్కు నివేదికలు అందాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. రెండున్నర నెలల తర్వాత ఈ సమీక్ష జరుగుతోంది.
గత సమావేశంలో కొంత మంది మంత్రులు సహా 27 మంది వెనకబడ్డారని సీఎం జగన్ చెప్పారు. జనవరి నుంచి ఎమ్మెల్యేలకు సపోర్ట్గా గడప గడప కార్యక్రమంలో కొత్త నెట్ వర్క్ అందుబాటులోకి రానుంది. ఎమ్మెల్యేలకు సహాయంగా పార్టీ గృహ సారథులు, సచివాలయాల కన్వీనర్లు రానున్నారు. 2023 జూన్, జూలై నాటికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం జగన్ డెడ్ లైన్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి నుంచి మరింత వేగం పెంచే విధంగా కసరత్తు జరుగుతోంది.
Read Also: Andhra Pradesh: విశాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు.. త్వరలోనే భారీ ప్రాజెక్టు
గడప గడపకు మన ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమం అని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఎన్టీవీతో చెప్పారు. నియోజకవర్గం అంతా పూర్తి చేయటానికి 8, 9 నెలల సమయం సరిపోదని.. ఒక ఏడాదిలో 60 సచివాలయాలను మాత్రమే పూర్తి చేయగలమని తెలిపారు. ఈ కార్యక్రమం పూర్తి చేయటానికి మరో ఐదారు నెలల సమయం పడుతుందని వివరించారు. సచివాలయాల పరిధిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని.. రోడ్ల విషయంపై ఇంకాస్త దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పని తీరు మెరుగు పరుచుకోకపోతే టికెట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకుంటారని విప్ కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.