Narayanaswamy: నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు.. ప్రజల విశ్వాసం పొందాలంటే సీబీఐ విచారణే మార్గం..!

Narayanaswamy

Narayanaswamy

Narayanaswamy: సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి డిమాండ్ చేశారు. చిత్తూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మాలంటే ఈ కేసుపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని అన్నారు. సాయికృష్ణ నిజంగా నేరస్తుడే అయితే కోర్టులు శిక్షించి ఉండేవని నారాయణస్వామి పేర్కొన్నారు. టెర్రరిస్టులను ఎన్‌కౌంటర్ చేసిన సందర్భాల్లో కూడా వారి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని గుర్తు చేశారు. సాయికృష్ణ తల్లి తన కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదని, అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమెను పిలిపించి మాట్లాడటం ఆశ్చర్యకరంగా ఉందని విమర్శించారు.

తమిళనాడులో జరిగిన పోలీసుల లాకప్ డెత్ ఘటనలపై కోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేశాయని, అదే విధంగా సాయికృష్ణ కేసులో కూడా పూర్తి స్థాయి విచారణ జరగాలని కోరారు నారాయణస్వామి.. అలాగే క్రాంతికుమార్‌ను సీఐ నాగరాజ్ వేధించిన అంశాన్ని కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. రెడ్‌బుక్ పాలన వల్లే క్రాంతికుమార్, సాయికృష్ణ మృతికి కారణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు. హోంమంత్రి శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు భజనకే పరిమితమయ్యారని విమర్శించారు. తిరుపతిలో మంత్రి లోకేష్ రెడ్‌బుక్ గురించి ప్రస్తావించిన తర్వాత పోలీసులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

×
×
Ad

తనను రెడ్‌బుక్‌తో పాటు ఎన్ని పుస్తకాల ద్వారా ఇరికించేందుకు ప్రయత్నించినా తాను భయపడబోనని నారాయణస్వామి స్పష్టం చేశారు. తనపై అవినీతి ఆరోపణలు చేయలేమని గతంలో చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు. ఇక, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కూడా నారాయణస్వామి విమర్శలు గుప్పించారు. పవన్ సినిమా నటుడని, ఆయన ఎప్పుడు ఏమి మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. ముందుగా కూటమి నాయకులపై ఉన్న క్రిమినల్ కేసులపై చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్‌ను కోరారు. మామిడి రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కిలోకు రూ.4 మద్దతు ధర కూడా వైసీపీ చేపట్టిన పోరాటాల ఫలితమేనని నారాయణస్వామి అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు వైసీపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.