అమెరికాలోని బోస్టన్లో టీడీపీ మహానాడు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అమెరికాలోని బోస్టన్ లో నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఏపీ కోలుకోలేనంత నష్టపోయిందన్న చంద్రబాబు.. అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ధరలు భారీగా పెంచేశారని, వైసీపీ నేతలను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారని ఆయన అన్నారు.
ఏపీలో విద్యుత్తు కోతలతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. తనతో పాటు కేసుల్లో ఉన్న వారికి జగన్ రాజ్యసభ సీటు ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. టీడీపీని అధికారంలోకి తేవడంలో ఎన్ఆర్ఐలూ కృషి చేయాలని కోరారు చంద్రబాబు.