ఈ నెల 19 వ తేదీన వ్యాపారి రాహుల్ తన కారులోనే శవమై కనిపించాడు. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి రాహుల్ను హత్యచేశారనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే ఆరుగురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే, రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యంను అరెస్ట్ చేసారు. అతడిని బెంగుళూరులో అరెస్ట్ చేసారు విజయవాడ పోలీసులు. రాహుల్ హత్య కేసులో ఏ2 గా ఉన్నాడు కోగంటి. హత్య జరిగిన తర్వాత రెండు రోజులు విజయవాడలోనే ఉన్న కోగంటి… తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పక్కా సమాచారంతో అతడిని బెంగుళూరులో పట్టుకున్న పోలీసులు ఈరాత్రే విజయవాడకు తీసుకురానున్నారు.