Site icon NTV Telugu

మరోసారి పోలీసులపై ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు.. త్వరలోనే రీకాల్..!

మరోసారి ఏపీ పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యానికి నిరసనగా నిర్వహించిన దీక్షలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.. పోలీసులు పార్టీ కండువాలు వేసుకున్నారని మండిపడ్డారు.. వ్యవస్ధ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతల్లో వుండిపోయింది.. ఇక్కడ పరిస్ధితులను చక్కదిద్దేందుకు కేంద్రం చూస్తోందని.. అందుకే రీకాల్ చేస్తారని చెప్పానని.. అది త్వరలోనే జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఇక, ప్రధానికి పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం భద్రత కల్పించడంతో విఫలమైందని ఆరోపించిన సీఎం రమేష్.. ఈ వ్యవహారంపై రాహుల్, సోనియా స్పందించాలని డిమాండ్‌ చేశారు..

Read Also: సీఎం ఇంట్లో కరోనా కలకలం.. ఆయన సతీమణి సహా 15 మంది పాజిటివ్‌

కాగా, ఈ మధ్యే ఆంధ్రప్రదేశ్‌లోని పోలీస్ వ్యవస్థపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు సీఎం రమేష్… రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం టెలిస్కోపుతో చూస్తుందన్న ఆయన.. అతి త్వరలోనే పోలీసు వ్యవస్థ ప్రక్షాళన ఉంటుందని పేర్కొన్నారు.. ఏపీలో పోలీసు ఉన్నతాధికారుల తీరు సరిగ్గా లేదని, వ్యవస్థలు ముఖ్యం అనే విషయాన్ని వారు ఎందుకు మర్చిపోతున్నారని ప్రశ్నించారు. అందుకే, అవసరమైతే కేంద్రం కొందరు ఐపీఎస్ అధికారులను రీ కాల్ చేస్తుందంటూ వ్యాఖ్యానించడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

Exit mobile version