VishnuVardhan Reddy: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ ఎమ్మెల్యే రాజీనామా ఓ డ్రామా అని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. సీఎం జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తామని ఇతర ఎమ్మెల్యేలు కూడా డ్రామా ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేయకపోవడం అందులో చిత్తశుద్ధి లేకపోవడమేనన్నారు. రాజీనామా ఆమోదించాలని రాజీనామా చేయడం లేదని.. చిత్తశుద్ధి ఉంటే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని వైసీపీకి విష్ణువర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ కూడా డ్రామా ఆడుతోందని.. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామంటే రాయలసీమ ఎమ్మెల్యేలు ఎందుకు నోరుమెదపడంలేదని ప్రశ్నించారు. రాయలసీమ కోసం ఎపుడైనా నిధుల కోసమో, ప్రాజెక్టుల కోసమో ప్రయత్నం చేశారా అని నిలదీశారు. రాయలసీమ ప్రజాప్రతినిధులు ద్రోహులు అని ఆగ్రహించారు.
మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ కర్నూలులో మాట్లాడడానికి సిగ్గులేకుంటే పక్కన కూర్చున్న ఏపీ కాంగ్రెస్ నేతలకైనా సిగ్గుండాలని బీజేపీ నేత విష్ణువర్ధన్రెడ్డి ఫైరయ్యారు. రాష్ట్ర విభజన డ్రాఫ్ట్ కమిటీ ఛైర్మన్గా ఉన్నది జైరాం రమేష్ అన్నారు. కరోనా సమయంలో అంబులెన్సులు అడ్డుకున్న ఘనత కేసీఆర్ది అని.. ఇపుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే ఏపీ ప్రజలు ఎలా హర్షిస్తారని ప్రశ్నించారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. రాజకీయ స్వార్థంతో వైసీపీ, టీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నాయన్నారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పి ఏపీలో అడుగుపెట్టాలని విష్ణువర్ధన్రెడ్డి అన్నారు. ఏపీ ఇంకా ఉందా.. తగలబడిపోయిందా అని చూడడానికి రాహుల్ గాంధీ వస్తున్నారని చురకలు అంటించారు.
Read Also: NV Prasad: ప్రజారాజ్యం నుంచి పుట్టిన బాధ, ఆవేదనే.. ఈరోజు జనసేన
ఆలయాలలోని అభిషేకాల్లో వివాదాలు సృష్టిస్తున్నారని.. కాణిపాకంలో రూ.700 ఉన్న అభిషేకం టిక్కెట్ రూ.5 వేలు చేయడం అన్యాయమని విష్ణువర్ధన్రెడ్డి ఆరోపించారు. శ్రీశైలంలో లక్ష రూపాయలకు ఒక సేవ ప్రవేశపెట్టారని.. దేవాదాయ, ధర్మాదాయ శాఖను దేవాదాయ, ఆదాయ శాఖగా మార్చాలని ఎద్దేవా చేశారు. ఆలయాలలో అభిషేకాల పేరుతో వ్యాపారం చేయడం మానుకోవాలన్నారు. దోచుకోవడానికి ల్యాండ్, సాండ్, వైన్, మైన్ ఉన్నాయని.. ఆలయాల్లో కూడా దోచుకుంటారా అని ప్రశ్నించారు. చర్చిల నుంచి, మసీదుల నుంచి డబ్బులు తీసుకోకుండా ఆలయాల నుంచి డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీశారు.