నంద్యాల జిల్లాలో జగన్ వసతి దీవెన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరం అన్నారు.
సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరం. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకు? జగన్ తన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పరిస్థితులపై ఢిల్లీ పెద్దలు ఛీదరించుకుంటున్నారు. సీఎం జగన్ అసభ్య పదాలు వాడటం మాని ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రూ.మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిన సీఎం జగన్ విద్యుత్ అప్పులు ఎందుకు తీర్చలేకపోయారు? ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యలపై ఇప్పటికే విపక్షాలు మండిపడుతూనే వున్నాయి. గతంలో కంటే ఇప్పుడు జగన్ భాష మారిందని, ఆయన టెన్షన్లో వుండి ఇలా మాట్లాడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.