ఏపీలో పీఆర్సీపై రగడ సాగుతోంది. ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన 11 పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. రెండో రోజు ముఖ్యమంత్రితో చర్చలు జరుగలేదని, ఆ రోజు మాకు మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముఖ్యమంత్రి పీఆర్సీపై తన ప్రకటన చేసి వెళ్ళి పోయారని, ప్రభుత్వంతో మాకు ఎటువంటి ఒప్పందం లేదని, మేము ఎక్కడా సంతకాలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. పీఆర్సీ వల్ల జీతాలు పెరగాలి కానీ ఇలా మోసం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రం ఇచ్చే స్కేల్స్ కు మాకు సంబంధం ఉండదని, ప్రజల సంక్షేమం కోసం ఉద్యోగులను సంక్షోభంలోకి నెడతారా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడు పీఆర్సీ ఇవ్వాల్సి వచ్చినా ప్రభుత్వాలు ఆదాయం లేదనే చెబుతుంటాయని, రాష్ట్ర విభజన సమయంలో ఆర్ధిక లోటు ఉన్నా గత ప్రభుత్వం 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చిన విషయం వాస్తవం కాదా? అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పారని, ఎంపీ అబద్ధాలు చెప్పారా అని ఆయన అన్నారు.