ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని, ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ లతా మంగేష్కర్. 7దశాబ్దాల్లో 30కి పైగా భాషల్లో 30వేల పాటలు పాడటం లతామంగేష్కర్ గానమాధుర్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.
దేశంలో ఆమె పాట వినబడని ఇల్లు లేదు, ఆమె గానం మెచ్చని వ్యక్తి లేడు.. ఆమె పొందని అవార్డు లేదు, రాని రివార్డు లేదు అని ఆయన కొనియాడారు. భారత రత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే…అవార్డులే కాదు విదేశీ ప్రభుత్వాలు కూడా పలు పురస్కారాలందించి ఆమెను గౌరవించాయని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ మృతి మనదేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని బాలకృష్ణ అన్నారు.