Ashok Gajapathi Raju On 40 Years Of TDP: తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మాజీమంత్రి అశోక్ గజపతి రాజు పేర్కొన్నారు. అన్న ఎన్టీఆర్ ఏ ఆశయంతో అయితే పార్టీని స్థాపించారో.. నేటికీ అలాగే నడుస్తోందన్నారు. ఈ సుదీర్ఘ చరిత్రలో అనేకసార్లు అధికారంలోకి వచ్చామని, ప్రతిపక్షంలోనూ ఉన్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు, మహిళలకు టీడీపీ అవకాశాలు కల్పించిందని చెప్పారు. భాషని, సంస్కృతిని కాపాడటంలో టీడీపీ క్రియాశీలక పాత్ర పోషించిందని.. అనేక ఉద్యమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపట్టిందన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ముందుకు వెళ్తున్నామన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ గేర్లో వెళుతోందని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న డబ్బుల్ని కూడా నొక్కేస్తున్నారు అశోక్ గజపతి రాజు ఆరోపించారు. వికేంద్రీకరణ అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. పన్నులుతో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతోందని మండిపడ్డారు. బ్రిటీష్ కాలం నాటి నియంత చట్టాలను తీసుకొస్తున్నారని.. జీవో నం.1తో ప్రతిపక్షాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో అభివృద్ధి మీద ఏమాత్రం దృష్టి సారించడం లేదని ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైసీపీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని, ఏపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉండటం వల్లే రాష్ట్రం దేశంలోనే వెనుకబడిపోయిందని చెప్పారు. నిధుల్ని పక్కదారి పట్టిస్తూ, నీతులు చెప్పడం విడ్డూరమన్నారు.
ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలయికపై మాట్లాడుతూ.. ఆ ఇద్దరిపై విమర్శలు చేసిన మంత్రులకు విజ్ఞత లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అశోక్ గజపతి రాజు కౌంటర్ వేశారు. పవన్, చంద్రబాబు కలవడం ఇదేం మొదటిసారి కాదన్నారు. రాజ్యాంగ వ్యతిరేక పనులుపై తామెప్పుడూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన ప్రాజెక్ట్స్ ఏమీ ముందుకు సాగడం లేదని ఆరోపణలు చేశారు.